
వంగూరు, వెలుగు: మండలంలోని సీఎం సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో రూ.73 లక్షల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనానికి సీఎం తండ్రి ఎనుముల నరసింహారెడ్డిపేరు పెట్టడంలో తప్పేమీ లేదని మాజీ ఉప సర్పంచ్ వేమారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ గ్రామపంచాయతీ నిర్మించడానికి గ్రామంలో స్థలం లేకపోవడంతో సీఎం సోదరుడు కొండల్ రెడ్డి 500 గజాల స్థలాన్ని ఇచ్చి, తన తండ్రి పేరు పెట్టాలని కోరినట్లు తెలిపారు.
గ్రామ పెద్దల సమక్షంలో చర్చించి సీఎం తండ్రి పేరు పెట్టామని చెప్పారు. సీఎం సోదరుడు రూ.50 లక్షల విలువైన స్థలాన్ని ఇచ్చారని తెలిపారు. వంశీ, చందు యాదవ్, రాఘవేందర్ యాదవ్, శ్రీరాములు, జంగయ్య, వాసు, సైదులు, గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.